మరో కేసు డ్రాప్‌ | Sakshi
Sakshi News home page

మరో కేసు డ్రాప్‌

Published Sat, Apr 7 2018 1:46 AM

Another case was droped

సాక్షి, హైదరాబాద్‌: అవినీతి నిరోధక శాఖ సరైన ఆధారాలు సేకరించకపోవడంతో మరో కేసును డ్రాప్‌ చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌ త్రివేది శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఇన్‌స్పెక్టర్‌ వై.వెంకటేశ్వర్‌రావు అవినీతికి పాల్పడ్డారంటూ ఏసీబీ 2009లో కేసు నమోదు చేసింది. దీంతో 11 నెలలపాటు పోలీస్‌ శాఖ సస్పెన్షన్‌ చర్యలు తీసుకుంది. ఆ తర్వాత సస్పెన్షన్‌ ఎత్తివేసి ఆయన్ను నగర కమిషనరేట్‌ పరిధిలోని స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌గా నియమించింది.

అయితే కేసు నమోదు తర్వాత అవినీతి నిరోధక శాఖ సరైన సాక్ష్యాలు సేకరించలేదు. దీంతో తనపై నమోదైన కేసులో అవినీతి ఆరోపణలు రుజువు కాలేదని, తనకు న్యాయం చేయాలని వెంకటేశ్వర్‌రావు హోంశాఖకు అప్పీల్‌ చేసుకున్నారు. ఆయన అప్పీల్‌ను పరిశీలించిన ప్రభుత్వం అవినీతి ఆరోపణలు రుజువు కాకపోవడంతో 11 నెలల సస్పెన్షన్‌ సమయాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణించాలని సూచిస్తూ.. ఆ 11 నెలల కాలానికి వెంకటేశ్వర్‌రావుకు దక్కాల్సిన జీతభత్యాలతో పాటు తదుపరి ప్రయోజనాలు కల్పించాలని ఆదేశించింది. 2016లో ఆధారాల్లేని 125 కేసులు ఏసీబీ మూసివేసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. 

Advertisement
Advertisement